Skip to main content

Namaste NRI

భారత్ కు మరోసారి అగ్రరాజ్యం భారీ సాయం

కరోనాపై పోరాటంలో భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా తనవంతు సహకారం అందిస్తోంది. తాజాగా మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అదనంగా 25 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. భారత్‌కు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ  బ్లింకెన్‌ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్‌ మీడియాతో మాట్లాడుతూ కరోనాపై పోరాటానికి ఇప్పటివరకు 200 మిలియన్‌ డాలర్లకు పైగా సాయం అందించినట్టు చెప్పారు. తాజాగా మరో 25 మిలియన్ల డాలర్లు సాయాన్ని అదనంగా ప్రకటించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

                 వ్యాక్సిన్‌ సరఫరా లాజిస్టిక్స్‌ను బలోపేతం చేసుకొనేందుకు తప్పుడు సమాచారం, వ్యాక్సిన్‌ సంకోచం వంటి సమస్యల్ని అధిగమించడంతో పాటు మరింత మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సాయం ఇస్తున్నట్టు తెలిపారు. ఇరు దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రత అధికంగానే ఉందని, దీన్ని అంతం చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తొలినాళ్లలో భారత్‌ చేసిన సహకారాన్ని మరువలేమన్నారు. అనంతరం జైశంకర్‌ మాట్లాడుతూ తక్కువ ధరలకే ప్రపంచంలో టీకాలు అందుబాటులో ఉంచే అంశంపైనా చర్చించినట్లు తెలిపారు. భారతీయ ప్రయాణికుల పట్ల అమెరికా సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, లభ్యతపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు.

Social Share Spread Message

Latest News