తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన తాజా చిత్రం రుద్రంగి. జగపతిబాబు ముఖ్యపాత్రలో నటించారు. అజయ్ సామ్రాట్ దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ట్రైలర్ చూసిన చాలా మంది అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ప్రాంతాల వారిగా యాస, భాష, సంస్కృతులు వేరైనా ప్రజల కథలు, కష్టాలు, కన్నీళ్లు మాత్రం ప్రతీ ప్రాంతంలో ఉంటాయి. అలాంటి సార్వజనీనమైన కథాంశమే రుద్రంగి. ఓ కళాకారుడిగా భవిష్యత్తు తరాలకు మంచి కథల్ని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాను అన్నారు.

దర్శకుడు అజయ్సామ్రాట్ మాట్లాడుతూ తెలంగాణ నేపథ్య కథే అయినా..ఇందులో చూపించే సమస్యలు, కష్టాలు ప్రతీ ప్రాంతంలో ఉంటాయి. తెలంగాణ వాస్తవ చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. తెలంగాణలో ఇంకా ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. ఈ నేలలో ఎన్నో త్యాగాలున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో వచ్చే స్పందనను బట్టి పాన్ ఇండియా రిలీజ్ గురించి ఆలోచిస్తాం అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పిన విధానం, కాన్ఫిడెన్స్ నచ్చి ఈ సినిమాకు అంగీకరించా. మేము అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువైంది. దర్శకుడు అజయ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిలో ఈ సినిమా తీశాడు. ఈ సినిమా పోరాటానికి సంబంధించింది కాదు. ఇదొక భావోద్వేగభరితమైన ఫ్యామిలీ డ్రామా. ఇందులో నేను పోషించిన పాత్ర విలన్ అని కూడా చెప్పలేను. కానీ నా పాత్ర అందరికి నచ్చుతుంది. మంచి పాత్ర చేయాలనే గట్టి సంకల్పంతో ఉన్న తరుణంలో ఈ సినిమాలో అవకాశం దక్కింది. ఈ సినిమాతో నేను కెరీర్లో థర్డ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టానని అనుకుంటున్నా. ఈ కథలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి అని తెలిపారు.















