రామ్చరణ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకుడు. వెంకటసతీశ్ కిలారు నిర్మాత. ఈ నెల 4న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రామ్చరణ్ మాట్లాడారు. ఎన్నో కథలు వింటూ ఉంటాం. కొన్ని నచ్చుతాయ్. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. పెద్ది కథ వినగానే నా హృదయాన్ని తాకింది. బుచ్చిబాబు దీన్ని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా నేరేట్ చేశాడు. పెద్ది అంటే ఓ పడిలేచిన కెరటం. నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఈ సినిమా చేస్తున్నప్పుడు అదే ఫీలింగ్. రాసిపెట్టుకోండి ఇండియాలోని టాప్4 డైరెక్టర్లలో బుచ్చిబాబు పేరుంటుంది. ఇందులో పనిచేసిన వారంతా ప్రాణం పెట్టారు. పెద్దికి బిగ్ పిల్లర్ ఏఆర్ రెహమాన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారాయన. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని మీరంతా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని కొండపై ఉన్న దుర్గమ్మను కోరుకుంటున్నా అని అన్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ఒక్క సినిమా చేసిన నాలాంటి దర్శకుడ్ని నమ్మి అవకాశం ఇచ్చిన రామ్చరణ్ని జీవితంలో మర్చిపోలేను. పెద్ది కమర్షియల్ సినిమా మాత్రమే కాదు. పడిలేచిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ ఆటగాడి ప్రయాణం. 350కోట్లు ఖర్చుపెట్టి నిర్మాతలు ఈ సినిమా తీశారు. అందరి నమ్మకాన్నీ పెద్ది నిజం చేస్తాడని నమ్మకంతో ఉన్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్, నిర్మాతలు వెంకటసతీశ్ కిలారు, వై.రవిశంకర్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, రత్నవేల్, అనంతశ్రీరామ్, ఏపీ రాజకీయప్రముఖులు కందుల దుర్గేష్, కేశినేని నాని పాల్గొన్నారు.





























