అమెరికాలో కమ్యూనిజం వేగంగా విస్తరిస్తోందని, దేశ ప్రజలు మేల్కొనకపోతే ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హెచ్చరించారు. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి, తన తండ్రి రాజకీయ ఎజెండాను కాపాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. డల్లాస్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మధ్యంతర సదస్సులో ట్రంప్ జూనియర్ ప్రసంగించారు. ఈ ఎన్నికలు సాధారణ కామన్ సెన్స్కు, వామపక్ష తీవ్రవాదానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అభివర్ణించారు. అమెరికా ఆత్మ కోసం రెండు విభిన్న సిద్ధాంతాలు పోటీ పడుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

తన ప్రసంగం ప్రారంభంలో, గతేడాది హత్యకు గురైన మితవాద కార్యకర్త, తన స్నేహితుడు చార్లీ కిర్క్కు ఆయన నివాళులు అర్పించారు. విశ్వాసం, కుటుంబం, స్వేచ్ఛ, దేశభక్తిని కాపాడిన యోధుడు చార్లీ. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని కాపాడుకుంటాం అని అన్నారు. వామపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్ జూనియర్, వారు చర్చలను కోరుకోవడం లేదని, ప్రజల నుంచి కేవలం విధేయతను మాత్రమే ఆశిస్తున్నారని ఆరోపించారు. వారు మీ జీవితంపై పూర్తి నియంత్రణ కోరుకుంటున్నారు అని అన్నారు.

తన తండ్రి హయాంలో ప్రవేశపెట్టిన వలస విధానాలు, ఇంధన విధానాలు, పన్ను సంస్కరణలు కొనసాగాలంటే కాంగ్రెస్లో రిపబ్లికన్ల నియంత్రణ అవసరమని స్పష్టం చేశారు. ఓవర్టైమ్, టిప్స్, సోషల్ సెక్యూరిటీపై విధించిన పన్ను కోతలు సంపన్నుల కోసం కాదని, అవి సాధారణ, శ్రామిక అమెరికన్లకు ప్రయోజనం చేకూర్చేందుకేనని ఆయన సమర్థించారు. 2024లో ట్రంప్ గెలిచారని రిపబ్లికన్లు నిర్లక్ష్యంగా ఉండవద్దని, మధ్యంతర ఎన్నికల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా వాషింగ్టన్ శక్తులు ట్రంప్ ఎజెండాను అడ్డుకుంటాయని హెచ్చరించారు.















