అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రత్యక్ష ఓటింగ్ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు, పెంపుదల ప్రతికార పన్నుల నిర్ణయాల మధ్య క్షీణించిన తన ప్రజాదరణను తిరిగి పుంజుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటిన జీవన వ్యయం, యుద్ధంలోకి అమెరికాను నెట్టడంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో ప్రధాన సవాళ్లుగా మారాయి.

ముందస్తు ఓటింగ్ (ఎర్లీ ఓటింగ్) ప్రక్రియ వర్జీనియాలో మొదలైంది. ఐదాహో, మిన్నెసోటా, సౌత్ డకోటా రాష్ట్రాల్లోని స్థానిక ఎన్నికల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు నేరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 3న అధికారికంగా పోలింగ్ జరగనుంది. ఓటర్లకు ఈ విధమైన ముందస్తు ఓటింగ్ సదుపాయం కల్పించడం అమెరికా ఎన్నికల విధానంలో ఒక భాగం.

ఈ ఎన్నికల ఫలితాలు యుఎస్ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సేనేట్లలో రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా లేదా డెమొక్రాట్లు అధికారాన్ని హస్తగతం చేసుకుంటారా అనేదాన్ని తేల్చనున్నాయి. అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ కోల్పోతే, అది ట్రంప్ మిగిలిన రెండేళ్ల పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా యుద్ధ నిర్ణయాలు, కీలక చట్టాల తయారీలో ప్రతిపక్ష డెమొక్రాట్ల ప్రభావం పెరుగుతుంది.















