నటుడు ఉపేంద్ర మరోసారి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఆయన కనిపించబోతున్నారు. జాంబీ రెడ్డి సీక్వెల్లో ఆయన ఓ ఇంట్రెస్టింగ్ రోల్ని పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. జాంబీ రెడ్డి-2 చిత్రంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తుండగా సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్వర్మ క్రియేటర్గా వ్యవహరిస్తున్నారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్లుక్ని విడుదల చేశారు.

ఇందులో ఆయన భారీ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ చేతిలో పొడవైన ఆయుధంతో కనిపిస్తున్నారు. ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధం అనే ట్యాగ్లైన్తో ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా జాంబీ రెడ్డి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాతో పాటు నేపాలీ, జపనీస్ భాషల్లోనూ ఈ సినిమా విడుదలకానుంది.















