సింగపూర్: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న వేళ, సింగపూర్కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నాట్య నివేదన సమర్పించేందుకు తిరుమలకు బయలుదేరారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సౌజన్యంతో, శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ (SSKS) ఆధ్వర్యంలో, సింగపూర్కు చెందిన అభినయ నాట్యాలయ – ప్రత్యూష అవధానుల శిష్యబృందం మరియు మాతృశ్రీ సాయి అకాడమీ – నిషిత యాబాజీ శిష్యబృందంకు చెందిన 22 మంది కూచిపూడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గురువులతో కలిపి సుమారు 45 మంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా తిరుమల మాడవీధుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కూచిపూడి నృత్యంతో నాట్య నివేదన సమర్పించనున్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయ కళలను అభ్యసిస్తున్న యువ కళాకారులు స్వయంగా తమ ఖర్చులతో భారత్కు వచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాట్య సేవ చేయడం విశేషంగా నిలుస్తోంది.

ముఖ్యంగా సింగపూర్ మరియు జర్మనీ నుంచి కళాకారులు తొలిసారిగా స్వయంగా తమ ఖర్చులను భరించి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నాట్య నివేదన సమర్పించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.
కార్యక్రమం అనంతరం పాల్గొనే కళాకారులకు VIP దర్శనం, లడ్డూ ప్రసాదాలు, స్థానిక రవాణా సదుపాయాలను TTD అందించనుంది.

విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరానికి మన సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్య సంప్రదాయాలను పరిచయం చేసి, వాటిని కొనసాగించేలా ప్రోత్సహించడమే శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ ప్రధాన లక్ష్యాలలో ఒకటని సంస్థ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు తెలిపారు.

ఈ నాట్య నివేదన కార్యక్రమాన్ని SVBC ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించవచ్చు.
SVBC ప్రత్యక్ష ప్రసారం
📅 19 సెప్టెంబర్ – సాయంత్రం 6:00 గంటలకు
📅 20 సెప్టెంబర్ – ఉదయం 8:00 గంటలకు
సింగపూర్ నృత్య కళాకారులు తిరుమల మాడవీధుల్లో సమర్పించనున్న ఈ నాట్య నివేదనను భక్తులు వీక్షించి, కళాకారులను ఆశీర్వదించాలని నిర్వాహకులు కోరారు.
గోవిందా… గోవిందా! 🙏















