తెలంగాణలో బీజేపీ కి క్యాడర్ లేదు, లీడర్ లేడు అన్ని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ను అబాసు పాలు చేసేందుకే బీజేపీ నాయకులు కుట్రపూరితంగా పరీక్షా పేపర్ల లీకేజీ లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ను బీజేపీ నాయకులు నాశనం చేస్తున్నారని అన్నారు. గతంలో అన్ని పరీక్షలు సజావుగా నిర్వహించగా నేడు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదన్నారు. పేపర్ల లీకుల వెనుక బారి కుట్ర దాగి ఉందని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాల్లో విధ్వేషపు మంటలు రేపుతున్న బీజేపీ పాచికలు తెలంగాణలో పారక పోవడంతో పరీక్ష పత్రాల లీకేజీకి పాల్పడి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఏనాడూ లేనంతగా ప్రజలను గందరగోళ స్థితి కి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిందని అన్నారు. బీజేపీ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీ కుట్రలన్నీ త్వరలో అన్ని వెలుగు లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.















