కరోనా ప్రపంచానికి చాలా నేర్పింది. లాక్డౌన్, కంటైన్మెంట్ జోన్స్, సోషల్ డిస్టెన్స్ లాంటి కొత్త పదాలతో పాటు జీవితానికి సంబంధించిన చాలా పాఠాలను కూడా నేర్పింది. కరోనా విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో పునరాలోచనలో పడేంది. అగ్రరాజ్యం అమెరికాలో కార్మిక గణాంకాల బ్యూరో ప్రకారం 2021 జులై నాటికి 40 లక్షల మంది అమెరికన్లు తమ ఉద్యోగులు వదులుకున్నారు. గత కొన్ని నెలలుగా ఇలా ఉద్యోగాలు వదిలేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉద్యోగులను ఎలా నిలుపుకోవాలన్నది కంపెనీ యజమానులకు ఇప్పుడో పెద్ద సవాలుగా తయారయింది.
ఉద్యోగులు ఎందుకిలా ఉద్యోగాలు మానేస్తున్నారు అన్నదానిపై ఓ లోతైన విశ్లేషణ జరిగింది. 4000కు పైగా కంపెనీల్లో 90 లక్షల మంది ఉద్యోగుల రికార్డులు పరిశీలించారు. 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగులే ఎక్కువగా రాజీనామాలు చేస్తున్నారు. వీరంతా తమ బ్రేకింగ్ పాయింట్ రీచయిన వారే. నెలల తరబడి అత్యధిక వర్క్ లోడ్ను మోసినవారే. టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో రాజనీమాలు ఎక్కువగా ఉండటం విశ్లేషణలో తేలిన రెండో అంశం.
కరోనా మహమ్మారి కాలంలో ఆయా సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేసినప్పటికీ కష్టకాలంలో యాజమాన్యాలు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడం కూడా ఈ రాజీనామాలకు ఒక కారణం. సుదీర్ఘమైన షిఫ్ట్లు, లేఆఫ్లు, వేతనకోతలతో కంపెనీలు తమను ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో పెరిగింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గి వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామన్నా, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండడం లేదు. ఆగస్టులో నమోదైన రాజీనామాల్లో 40 శాతం రెస్టారెంట్లు, హోటల్ రంగానికి చెందిన వారే.














