ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. చాలాకాలం తర్వాత బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 ముగింపు దశ మ్యాచ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్ను కలిశారు.

చరణ్ను చూసిన పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా స్వాగతం పలికి, శాలువాతో సత్కరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరూ కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో కుటుంబ విషయాలతో పాటు సినీ ప్రాజెక్టులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.





























