అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. లంచం కేసులో అదానీపై ఉన్న నేరాభియోగాలను అమెరికా కోర్టు డిస్మిస్ చేసింది. రెండేళ్ల క్రితం అమెరికాలో అదానీపై కేసు దాఖలైన విషయం తెలిసిందే. న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ సీఈవో వినీత్ జైన్పై ఉన్న కేసులను డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది. న్యాయవాది నికోలస్ గారౌఫిస్ ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసును డిస్మిస్ చేయడంతో, అదానీపై నేరాభియోగాలు పర్మనెంట్గా కొట్టివేసినట్లు అవుతుంది. ఇదే రకమైన నేరాభియోగాలను మళ్లీ నమోదు చేయరాదు.

2024 నవంబర్లో గౌతమ్ అదానీపై క్రిమినల్ కేసు పెట్టారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ల డాలర్ల లంచం ఇచ్చినట్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2 బిలియన్ల డాలర్లు ఆర్జించాలని అదానీ గ్రూపు భావించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లో బాండ్లు జారీ చేయడం ద్వారా సుమారు మూడు బిలియన్ల డాలర్లు ఆర్జించారని, దీంట్లో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కానీ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నది. చట్టాలు, నిబంధల ప్రకారమే వ్యవహరించినట్లు అదానీ గ్రూపు తెలిపింది.





























