కొలంబియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. మరో 570 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భూకంప కేంద్రం చోకో ప్రాంతంలోని శాన్ జోసె డెల్ పాల్మార్ సమీపంలో ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం సుమారు 107 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ప్రకంపనలు కొలంబియాలోని కాలీ, పెరీరా, మానిజాలెస్, బొగోటా తదితర ప్రాంతాలతోపాటు పొరుగు దేశాల్లోనూ నమోదయ్యాయి.

ఈ భూకంప ధాటికి అనేక ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కాలీలోని ఓ ఆసుపత్రిలో పీడియాట్రిక్, నియోనేటల్ విభాగాలు దెబ్బతిన్నాయి.శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షణ సిబ్బంది వెలికితీశారు. ఆసుపత్రుల్లోని కొంతమంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలీలోనే 30 శాతం వరకు ఆసుపత్రి నిర్మాణం దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. పెరీరా, కాలీ నగరాల్లో భవనాల కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మానిజాలెస్లోని చారిత్రక కేథడ్రల్ టవర్ ఒకటి కూలిపోయింది. పలు ఇళ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి.





























