నిహాల్, సంధ్య, అర్జున్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం సంధిగ్దం. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు పార్థసారది కొమ్మోజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తీర్థ క్రియేషన్స్ సంస్థ తన ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీగా నిర్మిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో అతిథిగా నటిస్తున్నారు. బిజేపి నేత పద్మ వీరపనేని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. పొలిటికల్ లీడర్ రమేష్ గుజ్జా, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ స్క్రిప్ట్ను దర్శకుడు పార్థసారధి కొమ్మోజుకు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పార్థసారది కొమ్మోజు మాట్లాడుతూ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి టెక్నికల్ టీమ్ దొరికింది. యంగ్, టాలెంటెడ్ ఆర్టిస్టులను తీసుకున్నాం. మా సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇది సినిమాకు హైలైట్ అవుతుంది. ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.














