అమెరికాలో స్థిరనివాసంపై కలలు కంటున్న భారతీయ వృత్తి నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అధిక డిమాండ్ కారణంగా రానున్న వారాల్లో భారతీయులకు ఉపాధి ఆధారిత మొదటి ప్రాధాన్యత(ఈబీ-1) గ్రీన్ కార్డ్లు తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చని అమెరికా హెచ్చరించింది. దీంతో ఇప్పటికే భారీ సంఖ్యలో వెయిటింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు మరో ప్రధాన వీసా క్యాటగిరీ అందుబాటులో లేకుండా పోయే ముప్పు ఏర్పడింది.

ఈబీ-1 విభాగంలో భారత్కు చెందిన వ్యక్తుల నుంచి విపరీతమైన డిమాండ్, గణనీయమైన సంఖ్యలో వీసాల వినియోగం కారణంగా సెప్టెంబర్ 30న ముగిసే అమెరికా ఆర్థిక సంవత్సరం కంటే ముందే భారత్కు కేటాయించిన కోటా పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ తన సెప్టెంబర్ వీసా బులెటిన్లో పేర్కొంది. ఈబీ-1 విభాగంలో భారత్కు కేటాయించిన కోటా పరిమితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పూర్తయితే రానున్న వారాల్లో ఈ విభాగాన్ని అందుబాటులో లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని, తదనుగుణంగా అవసరమైన మార్పులు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.















