ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్లో నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్ల్యాండ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. భారత్, ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను కోరారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్రస్టోర్తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్, ఎనర్జీ, స్పేస్ హెల్త్కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ తెలిపారు. స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్డాటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగుదేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు తెలిపారు.
కోపెన్హగెన్లో రెండో ఇండియా `నార్దిక్ సదస్సులో భారత ప్రధాని మోదీతోపాటు ఫిన్లాండ్, ఐస్ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్` రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంక్షోభం, సామాన్య ప్రజల ఆగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు.














