అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న మిలిటరీ హెలికాప్టర్కు అతి సమీపం నుంచి ప్రయాణికులతో కూడిన ఓ విమానం వెళ్లింది. ఈ ఘటన పట్ల ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వైట్హౌజ్ నుంచి మెరైన్ వన్ హెలికాప్టర్లో ట్రంప్ బయలుదేరగా, ఇక రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఓ విమానం డిపార్ట్ అయ్యింది. అయితే గాలిలోఉన్నసమయంలోనే హెలికాప్టర్, జెట్ సమీపంగా వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు క్షేమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మెరైన్ వన్ హెలికాప్టర్ ఎగురుతున్న సమయంలో ప్రయాణికులతో కూడిన విమానాన్ని ఎందుకు ఎగిరేందుకు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదు. సాధారణంగా దేశాధ్యక్షుడి హెలికాప్టర్ గాలిలో ఉన్నప్పుడు, మరే విమానాలు ఎగిరేందుకు అనుమతి ఇవ్వరు. ఆ సమయంలో కమర్షియల్ విమానాలను ఆపేస్తారు. జనవరి 2025లో మిలిటరీ హెలికాప్టర్, కమర్షియల్ జెట్ ఢీకొన్న ఘటనలో 67 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ట్రంప్ హెలికాప్టర్, కమర్షియల్ విమానం సమీపంగా ప్రయాణించిన అంశంపై ఫెడరల్ ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగే పరిస్థితి లేకున్నా, సేఫ్టీ ప్రోటోకాల్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.





























