
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాలన ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్గా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతన్నారు. ఈ క్రమంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించి, ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించనునట్లు తెలిసింది. మొదటి గ్రూప్లో అఫ్గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి పది దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారు.

రెండో గ్రూప్లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలున్నాయి. ఈ దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి.

మూడో గ్రూప్లో పాకిస్థాన్, భూటాన్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ దేశాలు తమ భద్రతా తనిఖీలను మెరుగుపరుచుకునేందుకు 60 రోజుల గడువు ఇస్తారు. ఆ సమయంలో లోపాలన పరిష్కరించుకోవచ్చు. ఒక వేళ ఇచ్చిన గడువులోపు ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలం అయితే, అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది.
