అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్ను హెచ్చరించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడికి అమెరికా సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ తమను సంప్రదించి చర్చలకు రావాలని కోరిందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. టెహ్రాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. హర్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకు సంబంధించి ఇరాన్, ఒమన్తో కలిసి తాము చర్చలు జరుపుతున్నామని అగ్రరాజ్యం వెల్లడించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది.





























