Skip to main content

Namaste NRI

భారత్‌లో ఎన్నికలు మా అంతర్గత విషయం… మీ జోక్యం అవసరం లేదు

భారత సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్‌ చేసిన పాక్‌ ఎంపీ ఫవాద్‌ హుస్సేన్‌ చౌదరికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చురకలంటించారు. తమ దేశం గురించి తాము చేసుకుంటామని,  ముందుగా అంతంత మాత్రంగానే ఉన్న మీ సొంత దేశం గురించి ఆలోచించుకోండంటూ సూచించారు. ఆరో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కేజ్రీవాల్‌ ఎక్స్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

తాను భార్య, తండ్రి, పిల్లలతో కలిసి ఓటు వేశానని,  తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో రాలేకపోయిందన్నారు. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్భణానికి వ్యతిరేకంగా తాను ఓటు వేశానని, మీరు కూడా వెళ్లి ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పోస్ట్‌ను పాక్‌ ఎంపీ ఫవాద్‌ చౌదరీ రీపోస్ట్‌ చేశారు. ద్వేషం, అతివాదభావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలన్నారు. మోర్ పవర్, ఇండియా ఎలక్షన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. దీనిపై కేజ్రీవాల్‌ ఘాటుగానే స్పందించారు.

చౌదరీ సాబ్ నేను, మా దేశ ప్రజలంతా మా సమస్యలను పరిష్కరించుకోగలం. ఇందులో మాజీ జోక్యం అవసరం లేదు. ప్రస్తుతం పాక్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. మీరు మీ దేశం గురించి ఆలోచించండి. భారత్‌లో ఎన్నికలు మా అంతర్గత విషయం. ఇందులో ఉగ్రవాదానికి నిలయమైన మీ దేశ జోక్యాన్ని భారత్ సహించదు అంటూ స్పందించారు.

Social Share Spread Message

Latest News