భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కీలక పరీక్షలు చేపట్టింది. అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ను పరీక్షించింది. బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలతో పాటు యాంటీ షిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే టెక్నాలజీని పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఈ ట్రయల్ పరీక్షలు జూన్ 10,11వ తేదీల్లో నిర్వహించారు. ప్రస్తుతం ఆధుని టెక్నాలజీతో వస్తున్న క్షిపణులు, మారీటైం ముప్పును ఎదుర్కొనే రీతిలో ఉండే కొత్త తరహా టెక్నాలజీ ఆధారిత ఆయుధాలను పరీక్షించినట్లు డీఆర్డీవో పేర్కొన్నది. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న దీక్షతో భారత్ తన ఆయుధ పరీక్షలను చేపట్టింది.

మూడు రకాల ఫ్లయిట్ టెస్ట్లను నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ విన్యాసాల్లో భాగంగా ఇంటర్సెప్టార్ క్షిపణులను లాంచ్ చేశారు. నిర్దేశిత టార్గెట్లపై వాటిని పరీక్షించారు. అనుకున్న లక్ష్యాలను అందుకున్నట్లు తెలిసింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్కు చెందిన పలు దశలను ఈ పరీక్షల్లో టెస్ట్ చేశారు. దూసుకు వస్తున్న క్షిపణులను నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షించారు. మిస్సైల్ను డిటెక్ట్ చేసి, ట్రాక్ చేసి దాన్ని ధ్వంసం చేసే టెక్నాలజీని పరీక్షించారు. భారత వ్యూహాత్మక భద్రత అంశంలో ఇది కీలకమైన అడుగు అని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.





























