విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ సందర్శకులు, జర్నలిస్టులపై వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విదేశీయులు అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చనే దానిపై పరిమితులు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనను బోస్టన్లోని ఫెడరల్ న్యాయమూర్తి నిలిపివేశారు. ఈ నిబంధన అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం.

కార్మిక సంఘాలు, ఉన్నత విద్యా రంగానికి చెందిన పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) ఇచ్చిన వివరణలు సరిపోవని స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ సందర్శకులు, జర్నలిస్టుల బస కాలాన్ని పరిమితం చేయడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జాతీయ భద్రత, వీసా వ్యవస్థలో మోసాలను అరికట్టడం వంటి కారణాలను చూపిందని జడ్జి తెలిపారు. అయితే ఈ విధాన మార్పు వల్ల తలెత్తే సమస్యలను సమర్థంగా పరిశీలించడంలో, తక్కువ కఠినమైన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆ శాఖ విఫలమైందని పేర్కొన్నారు. డిహెచ్ఎస్ ఇచ్చిన కారణాలను అత్యంత బలహీనమైనవి గా జడ్జి అభివర్ణించారు.















