
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గం.లకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.
















