
కెనడాలో మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. వచ్చేనెల 28న మొత్తం 343 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడాపై విధిస్తున్న సుంకాల అంశమే ఈ సారి ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది. ఎన్నికల ప్రకటన వెలువడగానే ప్రధాని కార్నీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేత పియరీ పోలీవర్ ప్రచారం ప్రారంభించారు. దాదాపు 37 రోజుల పాటు ప్రచారం జరుగనుంది. తొమ్మిదేండ్లపాటు దేశాన్ని పాలించిన జస్టిన్ ట్రుడో స్థానంలో కొత్త ప్రధానిగా ఈ నెల 14న కార్నీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ విధిస్తున్న సుంకాల అంశాన్నే తొలి రోజు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తారు. కెనడా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.

కెనడాలో బ్యాలెట్ పేపర్పై జస్టిన్ ట్రుడో లేకుండా ఎన్నికలు జరుగడం ఇదే మొదటిసారి. దేశంలో ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు అధికారం కోసం హోరాహోరీ తలబడుతున్నాయి. కాగా, ప్రధానిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ నాయకుడు ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.
