అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల కిందట భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రూ.38 లక్షలు ఖర్చు పెట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర సమాచార కమిషన్కు తెలిపింది. 2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చారు. 36 గంటలపాటు మన దేశంలో జరిపిన ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గుజరాత్లోని మోతెరా క్రికెట్ స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మిశల్ భటెనా 2020 అక్టోబరు 24న దరఖాస్తు చేశారు. దీనికి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆప్పీలుకు వెళ్లి, తుది ప్రయత్నంగా సమాచార కమిషన్ను ఆశ్రయించారు. అంతర్జాతీయ నియమాల ప్రకారమే ఖర్చు పెట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.














