
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరారు. సోమవారం ట్రూత్ ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా 2019లో అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన హౌడీ మోదీ సందర్భంగా ట్రంప్తో దిగిన ఓ పవర్ఫుల్ ఫొటోను మోదీ షేర్ చేశారు. ట్రూత్ సోషల్లో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు వేచి చూస్తున్నానంటూ మోదీ తొలి పోస్టు పెట్టారు. మరో పోస్ట్లో ఫ్రిడ్మ్యాన్తో జరిగిన తన సంభాషణను పంచుకున్నందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మ్యాన్ పాడ్కాస్ట్ లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ పాడ్కాస్ట్లో మోదీ పలు అంశాలపై మాట్లాడారు. లెక్స్ ఫ్రిడ్మ్యాన్తో మోదీ పాడ్కాస్ట్ వీడియోను తన స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పంచుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ షేర్చేసిన ఈ పోస్టును మోదీ రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్కు నా స్నేహితుడు, అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరిక దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరెన్నో అంశాలను నేను కవర్ చేశాను అని పేర్కొన్నారు.
