భారత మూలాలున్న బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు. బ్రిటన్ ప్రధాని పీఠానికి రిషి సునక్ మరొక్క అడుగు దూరంలో ఉన్నారు. అధికార కంజర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యేందుకు ఐదో రౌండ్లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రిషి సునక్కు 137 మంది కంజర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓటేయగా, సమీప పోటీదారు, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్కు 113 ఓట్లు వచ్చాయి. దీంతో కంజర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికవడం, తద్వారా ప్రధాని పీఠంపై కూర్చొనుందుకు రిషి సునక్తో పాటు లిజ్ ట్రస్ మాత్రమే బరిలో ఉన్నారు. మొదటి నుంచి చివరి రౌండ్ వరకు రిషి సునక్ పోటీలో అగ్రస్థానంలో నిలువడం గమనార్హం. ఇక 105 ఓట్లు మాత్రమే పొందిన వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు. ఆగస్టు 1 నుంచి దాదాపు నెల పాటు దశలవారీగా జరిగే పోలింగ్లో 1.6 లక్షల పైచిలుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్లో పాల్గొంటారు. వీటిలో మెజారిటీ ఓట్లు సాధించేవారే కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికవుతారు. తర్వాత ప్రధాని పీఠమూ ఎక్కుతారు.














