Skip to main content

Namaste NRI

వర్జీనియాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కాపిటల్‌ ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. తిరుమలను మరింపిచేలా అర్చకులు శ్రీవారి కల్యాణ క్రతువును కన్నుల పండుగగా నిర్వహించారు. వేదిక పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. తొలుత స్వామివారికి మంగళ స్నానాలు చేయించి పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేదికను రంగురంగుల తోరణాలు, పూలతో తీర్చిదిద్దారు. అభిషేకం, అర్చనలు ఇలా పలు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. వేద మంత్రాలు, మంగళ హారతులతో పాటు పలువురు చిన్నారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు.

కల్యాణ క్రతువు ముగిసిన అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్ని చంద్ర మలవత్తు, డా. మధుసూదన్‌ రెడ్డి కాశీపతి సమన్వయ పరిచారు. వర్జీనియా కాంగ్రెస్‌ ప్రతినిధి సుహాస్‌ సుబ్రహ్మణ్యం, తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, మిర్చి యార్డ్‌ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం చంద్ర మలవతు మాట్లాడుతూ.. అమెరికాలో ఉండే శ్రీవారి భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం తమ లక్ష్యమని చెప్పారు. ఈ మహోత్సవం విజయవంతం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా ప్రవాసాంధ్రులు జంటలతో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News