Skip to main content

Namaste NRI

యూరప్‌ దేశాల్లో ఘనంగా టీడీపీ మహానాడు

యూరప్‌ ఖండంలోని పలు దేశాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడును టీడీపీ అభిమానులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. డా.కిశోర్‌ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయా దేశాల్లోని టీడీపీ కుటుంబ సభ్యులంతా సమన్వయంతో బలమైన టీమ్‌గా ఏర్పడి ఈ మహానాడును ఘనంగా నిర్వహించినట్లు యూరప్‌ టీడీపీ విభాగం తెలిపింది. ఒకే వేదికపై టీడీపీ సీనియర్‌ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంతగాని నర్సింహప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

                వివేక్‌ కరియావుల (నెదర్లాండ్స్‌) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమర్నాథ్‌ (డెన్మార్క్‌), వేంకటపతి (నార్వే), ప్రముఖ్‌ (ఐర్లాండ్‌), సుమంత్‌, దినేశ్‌ (మాల్టా) సతీశ్‌ (ఇటలీ), సాయి మౌర్య (హంగేరి), ప్రవీణ్‌ (పోలాండ్‌), శివకృష్ణ, కొండయ్య (బెల్జియం) ఇతర నాయకులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొని పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. యూరప్‌లోని 25కి పైగా దేశాల్లో టీడీపీ విస్తరణ, సోషల్‌ మీడియా ద్వారా ప్రజా చైతన్యం, క్షేత్రస్థాయిలో ప్రచారం, తటస్థంగా ఉన్న స్థానిక యువతను పార్టీ వైపు ఆకర్షితుల్ని చేయడం, సామాజిక సేవను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం తదితర తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.  యూరప్‌లోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆన్‌లైన్‌ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events