రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ది వారియర్. కృతి శెట్టి నాయకిగా నటిస్తున్నది. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ పోలీస్ సినిమాల్లో నటించడం కొన్ని రోజులు ఆపేద్దాం అనుకున్న సమయంలో లింగుస్వామి అలాంటి కథే తీసుకొచ్చారు. అయితే ఈ స్క్రిప్టు విన్న తర్వాత పోలీస్ కథలో నటిస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనుకున్నాను. ఇందులో సత్య అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తా. సత్య లాంటి పోలీస్ అధికారులు ఎంతోమంది డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. దర్శకుడు లింగుస్వామికి హ్యాట్సాప్ చెబుతున్నా అన్నారు. నాయిక కృతిశెట్టి మాట్లాడుతూ నిజం కోసం నిలబడే ప్రతి ఒక్కరూ వారియరే. మీరంతా జీవితంలో అలా నిలబడాలని కోరుకుంటున్నా. రామ్ మంచి సహా నటుడు. ఆయన ఎనర్జీ చూస్తే ఉస్తాద్ రాపో అని పిలుస్తుంటారని ఈ సినిమా చేశాక తెలిసింది అని చెప్పింది.
నా తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాధించాయి అని దర్శకుడు లింగుస్వామి అన్నారు. తెలుగులో నేరుగా చేసిన మొదటి చిత్రమిది. టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు ఇది సరైన సినిమా అన్నారు. రామ్ డ్యాన్స్లు, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. మీకు వందశాతం నచ్చే సినిమా అవుతుంది అన్నారు. ఈ చిత్రాని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్కీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. లింగుస్వామి దర్శకుడు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి కిషోర్, వివేక్ కూచిభొట్ల, దర్శకులు హరీశ్ శంకర్, తిరుమల కిషోర్, సమర్పకులు పవన్ కుమార్, లిరిసిస్ట్ సాహితీ తదితరులు పాల్గొన్నారు.














