ఇరాన్పై దాడుల్ని అమెరికా ఆపేసింది. శాంతిప్రక్రియ అనంతరం ఇరాన్పై అమెరికా వరుసగా 13 రోజులపాటు దాడులు చేసింది. తాజాగా శుక్రవారం నుంచి ఈ దాడుల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారు. ఈ అంశంపై అమెరికా అధికారులు స్పందించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉండటంతోపాటు, అమెరికా క్షిపణుల నిల్వలు తగ్గిపోవడం వంటివి కారణాలుగా అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో ఇంకా యుద్ధం కొనసాగించడం వల్ల ఈ సంక్షోభం ఇంకా పెరుగుతుందనే భావనతోనే యుద్ధాన్ని నిలిపివేసినట్లు చెబుతున్నారు. దీనిపై ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై దాడులు చేయొద్దని ట్రంప్ మిలిటరీని ఆదేశించారు. అప్పటికే దాడులపై రూపొందించిన ప్రణాళికల్ని రద్దు చేయాలని సూచించారు. చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఈ అంశంపై వైట్హౌజ్ కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ట్రంప్ ద్వైపాక్షిక చర్చలకు కట్టుబడి ఉన్నారని, అయినప్పటికీ ఒకవేళ ఇరాన్ కనుక మళ్లీ దాడులకు దిగితే సైనిక చర్యకు వెనుకాడవద్దని ట్రంప్ ఆదేశించినట్లు వైట్హౌజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.





























