Skip to main content

Namaste NRI

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహా నగరమందు వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు

శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని  పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు వంద మందికి పైగా వాసవి మాత భక్తులు మరియు కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్ వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో  అలంకరించిన  పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. తరువాత విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. 

అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. తరువాత చిరంజీవి లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాల ను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణ తో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాల ఆనందంగా ఉందని కోర్ కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. 

కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ మరియు డైరెక్టర్ అయిన బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు మరియు ఆలయ ప్రధాన అర్చకులైన ముత్తుస్వామి ని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణ న్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులంద రూ ఉత్సాహంగా పాల్గొనడం చాల ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. తరువాత సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ కి, ఇందుకు సహకరించిన ప్రశాంత్ కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్ మరియు నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు.

కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, మరియు నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ మరియు పుష్పా లంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య  తదితరులకు కమిటీ సభ్యులు  ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.   తరువాత కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహార ణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన  విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు.

చివరిగా అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు, కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్ కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events