నయా భారత్, వికసిత్ భారత్ అంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్న తరుణంలో పలు అంతర్జాతీయ సంస్థలు వెలువరిస్తున్న నివేదికలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. బీజేపీ పాలనలో అనేక ప్రగతి సూచీల్లో దేశం ఏటికేడు దిగజారుతున్నది. తాజాగా ప్రపంచ బ్యాంకు వెలువరించిన నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశం శ్రీలంక కూడా మన కంటే మెరుగ్గా ఉన్నదని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.

ఈ సంస్థ తాజాగా వెలువరించిన నివేదికలో, శ్రీలంక ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరగా, భారత్ మాత్రం దిగువ మధ్య ఆదాయ విభాగంలోనే మిగిలిపోయింది. విభిన్న ఆర్థిక ప్రగతి మార్గాలను గుర్తించిన ప్రపంచ బ్యాంకు తన తాజా ఆదాయ వర్గీకరణలో శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్లను ఉన్నత-మధ్య-ఆదాయ వర్గానికి చేర్చింది. కేవలం కొన్ని సంవత్సరాల క్రితమే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇది ఒక పెద్ద ఊరటగా పరిణమించింది. అయితే భారత్ మాత్రం 2007 నుంచి తన దిగువ-మధ్య-ఆదాయ స్థితిని కొనసాగిస్తున్నది.





























