తమ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధుల కు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి, తమ సానుభూతిని ప్రకటించిన భారత్ ను మరిచిపోలేమని తెలిపింది. ఈ చర్య ఇరుదేశాల మధ్య స్నేహానికీ, అనుబంధానికీ ప్రతీక అని, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నది. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ చిరకాల బంధాన్ని, స్నేహాన్ని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని తెలిపింది.

ఇరాన్ దివంగత సుప్రీం నేత ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఉంచారు. దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. భారత్ తరఫున బీహార్ గవర్నర్, సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు భారత్కు చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషహద్లో ఈనెల 9న ఖననం చేయనున్నారు.





























