గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్టు 15 సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించి గోల్కొండ కోటపై సిఎం జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన ఆలపించారు. అనంతరం ప్రాజెక్టులు, రైతులను ఉద్ధేశించి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత ప్రధాన మంత్రి నెహ్రూ గాంధీ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టుల ఫలాలు అనుభవిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ పేర్కొన్నారని అన్నారు. ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం అధికంగా ఉందని తెలియజేశారు.

వ్యవసాయాన్ని పండగ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని, రైతుభరోసా కింద రూ. వేల కోట్లు రైతులకు అందించామని అన్నారు. మొత్తంగా రైతు సంక్షేమం కోసం రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం సరికొత్త రికార్డులు అధిగమించిందని, కృష్ణా- గోదావరి జలాల విషయంలో రాజీ పడేది లేదని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని, త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించనున్నామని, వ్యవసాయంతో పాటు నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. కల్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని, తెలంగాణ ఆడబిడ్డలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నామని, మహిళలను ఆర్టిసి అద్దె బస్సులకు యజమానులుగా చేశామని అన్నారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, కొత్త రేషన్ కార్టుల పంపిణీ ఇవాళే ప్రారంభించుకుంటున్నామని స్పష్టం చేశారు.















