గూగుల్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రకటనల ఆదాయానికి సంబంధించిన సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. డిజిటల్ మీడియా సంఘమైన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా గూగుల్ లాంటి సంస్థలు తమ మీడియాలో వచ్చే న్యూస్ కంటెంట్ను వాడుకుంటున్నాయని, ఆదాయంలో మాత్రం సరైన వాటా చెల్లించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై సీసీఐ స్పందించింది. ప్రజాస్వామ్య దేశంలో వార్త సంస్థల కీలక పాత్రను తక్కువ అంచనా వేయొద్దని వ్యాఖ్యానించింది.
వార్తా సేవలకు సంబంధించి గూగుల్ తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో మీడియా సంస్థల కంటెంట్ను వాడుకుంటే డబ్బులు చెల్లించేలా ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను సీసీఐ గుర్తు చేసింది. అయితే దీనిపై గూగుల్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. గూగుల్ ఒక్క భారత్లోనే కాదు మరికొన్ని దేశాల్లో సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటుండగా భారీ జరిమానాలు విధిస్తున్నాయి ఆయా దేశాల విచారణ సంస్థలు. ఈ నేపథ్యంలో భారత్లో తాజాగా ఎదురైన పరిణామం గూగుల్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యింది.