కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా సెబాస్టియన్ పీసీ 524. కోమలీ ప్రసాద్, నువేక్ష నాయికలుగా నటిస్తున్నారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథులుగా వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, చెర్రీ, నటుడు సాయికుమార్, అడవి శేష్, సప్తగిరి, అకాష్ తదితరులు హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమా చూసేవారికి సెబాస్టియన్ పాత్ర గుర్తుండిపోతుంది. మాట ఇస్తే వెనక్కి తీసుకోని వ్యక్తిత్వం ఈ పాత్రలో చూస్తారు అని అన్నారు. అనంతరం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఒక సినిమా అవకాశం విలువ ఎంతో నాకు తెలుసు. కెమెరా ముందు నిల్చోవడమే ఒక వరంగా భావిస్తున్నాను. మనకోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నిరాశపర్చకూడదు అనుకుని మంచి కథలు ఎంచుకుంటున్నాం. ఈ సినిమా ట్రైలర్కు వచ్చిన స్పందనే సినిమాకూ ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్, దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, నిర్మాత వై రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు మార్చి 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.














