సౌదీ అరేబియా ప్రభుత్వం రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఒకేరోజున 81 మందిని ఉరితీసి సంచలనం సృష్టించింది. ఆధునిక చరిత్రలో ఒకదేశం అమలు చేసిన అతిపెద్ద సామూహిక మరణశిక్ష ఇదే కావడం గమనార్హం. మరణశిక్షకు గురైన వారిలో కొందరు ఆల్ ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగివున్నట్టు నిర్థారణ కాగా, కొందరు మహిళలను, పిల్లలను చంపినట్టు తేలింది. దాంతో వారందరినీ ఉరితీశారు. వారిలో 73 మంది సౌదీ అరేబియా జాతీయులు కాగా, ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడు ఉన్నారు. గత మూడున్నర దశాబ్దాల కాలంలో ఒకేరోజు ఇంతమందికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రథమం. 1980లో సౌదీలో ఒకేరోజు 63 మంది తలలు నరికి మరణశిక్ష అమలు చేశారు. 2016లో 47 మంది, 2019లో 37 మంది మరణశిక్షకు గురయ్యారు.














