జపాన్ ప్రధాని పుమియా కిషిదా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడులను వెంటనే నిలిపివేయాలని మోదీ, కిషిదా ఓ సంయుక్త ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో హింసకు రష్యా తక్షక్షమే ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్పై రష్యా సేనల దాడులు అంతర్జాతీయ కట్టుబాట్ల మూలాలను కుదిపేశాయని జపాన్ ప్రధాని కిషిద వ్యాఖ్యానించారు. ఏకపక్ష చర్యలతో పరిస్థితులను బలవంతంగా మార్చాలనుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని విభేదాలను అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కిషిద పిలుపునిచ్చారు. ఈ తరుణంలో కొత్త ప్రపంచ క్రమం కోసం చేయాల్సి ఉందని, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సంస్కరించాలని తెలిపారు. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఇండో ` పసిఫిక్ ప్రాంతంలో ఆక్రమణలకు, బెదిరింపులకు తావు ఇవ్వరాదని, దక్షిణ చైనా సముద్రంలో తలెత్తిన వివాదాలన్నీ అంతర్జాతీయ చట్టాలకు లోబడే పరిష్కరించాలని పిలుపునిచ్చారు.














