ప్రముఖ క్యాన్సర్ వైద్యులు, కిమ్స్, ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ అతి పిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక బ్రిటిష్ ఎంపైర్ ఓబీఈ(ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్) పురస్కారాన్ని దక్కించుకున్నారు. లండన్ సమీపంలోని విండ్సర్ కాలేజీలో ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ ఛార్లెస్ చేతుల మీదుగా ఫి.రఘురామ్ ఓబీఈ అవార్డును అందుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 తరపున ఈ అవార్డును ప్రిన్స్ ఛార్లెస్ అందజేశారు. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉత్తమ సేవలు, పరిశోధనలు, ఇండియా, యూకే సంబంధాలు మెరుగుపడటంలో కృషికిగానూ డాక్టర్ పి.రఘురామ్కు ఈ అవార్డును అందజేశారు. ఇది వరకు డాక్టర్ పి.రఘురామ్ భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారాలైన పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డులను 2015, 2016లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. గత శతాబ్ద కాలంలో ఈ అరుదైన ఘనత సాధించిన భారత సంతతి యువసర్జన్ పి.రఘురామ్ కావడం విశేషం.














