అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే ఆటా 17వ మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ ఈసారి తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో మన ఊరు- మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం, వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వారు కవితకు వివరించారు. భవిష్యత్ తరాలకు మన బతుకమ్మ విశిష్టత గురించి తెలిపేందుకు బతుకమ్మ పై ఇంగ్లీష్లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది మహాసభలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువేశ్ భుజాల, వేణు సంకినేని, జయంత్ చల్ల, శరత్ వేముల తదితరులు పాల్గొన్నారు.














