బహ్రెయిన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేక్ కట్ చేసి రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే నెంబవర్ వన్గా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలమే తెలంగాణ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎనలేనిదని, ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి, కార్యదర్శి పుప్పాల లింబద్రి, కార్యదర్శులు సంగేపు దేవన్న, చెంన్నమనేని రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.














