ఈశ్వర్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు ప్రభాస్. 2002 జూలై 28న ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ప్రభాస్ కెమెరా ముందుకు వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. బాహుబలి చిత్రం ఆయనకు పాన్ ఇండియా హీరో ఇమేజ్ను తీసుకొచ్చింది. సినీ రంగంలో ప్రభాస్ 20 వసంతాల ప్రయాణాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో ఆలిండియా రెబల్స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు జేఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో కృష్ణంరాజు నివాసంలో వేడుకల్ని నిర్వహించారు. కృష్ణంరాజు మాట్లాడుతూ తొలి సినిమా చూశాక ప్రభాస్ పెద్ద హీరో అవుతాడనిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రభాస్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు. ఈశ్వర్ చిత్ర దర్శకుడు జయంత్. సి.పరాన్జీ మాట్లాడుతూ ఈ మధ్యే ప్రభాస్ను కలిశాను. పెద్ద హీరోననే గర్వం ఆయనలో ఏ మాత్రం కనిపించదు అన్నారు. ఈశ్వర్ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభాస్ అంత పెద్ద హీరో అయినా ప్రతి ఒక్కరితో విసమ్రంగా ఉంటాడు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామల, దర్శకుడు జయంత్ సి.పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్, జె.ఎస్.ఆర్.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.














