అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. అల్లరి నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభివృద్ధికి నోచుకొని మారుమూల పల్లెలకు న్యాయం చేయాలని తపించే కథానాయకుడు, ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో నరేష్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆనంది గిరిజన యువతిగా నటించింది. సాయం చేత్తే మనిసి.. దాడి సేత్తే మృగం.. మేం మనుషులమే సారూ. మీరు మనుషులైతే సాయం చేయండి పాతిక కిలోమీటర్లు ఇవతలికి వస్తే కానీ వీళ్లు ఎలా బతుకుతున్నారో మనకు కూడా తెలియలేదు. వీళ్లని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియడం లేదు మాస్టారు అంటూ టీజర్లో వినిపించిన సంభాషనలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి.














