శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 225 సభ్యులు గల పార్లమెంటులో విక్రమసింఘేకు 134 మంది ఎంపీలు మద్దతు పలికారు. ఆయన సమీప ప్రత్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి దుల్లాస్ అలహప్పెరుమాకు 82 ఓట్లు రాగా, వామపక్ష జనతా విముక్తి పెరుమన అభ్యర్థి అనుర కుమార దిస్సనాయకేకు కేవలం మూడు ఓట్లు వచ్చాయి. అనంతరం విక్రమ సింఘే మాట్లాడుతూ ప్రజలు కొత్త రాజకీయాలు కోరుకొంటున్నారని అన్నారు. కష్ట సమయంలో దేశాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గత 48 గంటలు మనం విడివిడిగా పనిచేశాం. ఆకాలం ముగిసింది. ఇప్పుడు మనమంతా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన, మహింద రాజపక్సలతో పాటు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసకు విజ్ఞప్తి చేస్తున్నా. రండి అందరం కలిసి పనిచేద్దాం. ఏ విషయంపై అయినా మీతో చర్చింటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు.














