ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. వారికి ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ఏ ఇతర దేశంలోని మెడికల్ కాలేజీలో చదువు మధ్యలో ఆపేసి వచ్చిన విద్యార్థికి మన దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చే నిబంధన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం` 1956లో గానీ, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం-2019లో గానీ లేదు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్ 2002 పరిధిలోకి గానీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ రెగ్యులేషన్స్`2021 పరిధిలోకి గానీ రారు. వీరికి భారతీయ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఒప్పుకోదు. అందువల్ల వారికి అడ్మిషన్లు ఇవ్వలేం అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో లిఖతి పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో 20 వేల మంది విద్యార్థుల భవిత్వం అందకారమైంది.














