ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించే ఎన్పీటీ సంస్థ ఉన్నత స్థాయి సమావేశంలో గుటెర్రస్ మాట్లాడుతూ ఈ ప్రపంచం అణు వినాశనానికి అడుగు దూరంలో ఉన్నట్లు తెలిపారు. ఒక చిన్న పొరపాటు జరిగినా, ఓ చిన్న తప్పుడు అంచనా వేసినా, అణు విధ్వంసం జరుగుతుందన్నారు. దాని వల్ల మానవాళి ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్దంతో పాటు ఆసియా, మిడిల్ ఈస్ట్లో ఉన్న అణ్వాయుధ ఆందోళనల నేపథ్యంలో గుటెర్రస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రష్యా అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ దేశమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 వేల అణ్వాయుధాలు ఉన్నాయని అన్నారు. ఆత్మరక్షణ పేరుతో చాలా వరకు దేశాలు అణు బాంబుల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.














