ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి మరోసారి కలవర పెడుతున్నది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. చైనా, హాంకాంగ్, మకావు దేశాల నుంచి అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేసింది. కొవిడ్ నెగెటివ్ రిపోర్టుతో వచ్చిన వారినే తమ దేశంలోకి అనుమతిస్తామని పేర్కొన్నది. ఈ నెల 5 నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ఒక ప్రకటన చేసింది. గత బుధవారం చైనా నుంచి ఇటలీకి వెళ్లిన రెండు విమానాల్లోని ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే, సగం మందికి పైగా ప్రయాణికుల్లో కొవిడ్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొవిడ్తో సతమతమవుతున్న అమెరికా అప్రమత్తమైంది.














