Namaste NRI

కోర్టులో వాదించనున్న రోబో..ప్రపంచంలోనే మొదటిసారి

ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన డునాట్‌పే సంస్థ అభివృద్ధి చేసింది. మనిషి పక్షాన ఇది కోర్టులో కేసు వాదించనుంది. లాయర్లకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధ ఆధారంగా ఒక బోట్‌ను ఈ సంస్థ రూపొందించింది. వచ్చే నెల అమెరికాలోని ఓ కోర్టులో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఇది వాదనలు వినిపించబోతున్నది. అయితే, ప్రత్యక్షంగా ఎలాంటి రోబో ఉండదు. కోర్టుకు హాజరుకాదు. కోర్టుకు హాజరయ్యే ప్రతివాది తన సెల్‌ఫోన్‌లో ఈ యాప్‌ వేసుకోవడంతో పాటు, ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవాలి. కోర్టులో వాదనలను ఈ ఏఐ బోట్‌ విని ఎలా వాదించాలి, ఏ పాయింట్‌ను లేవనెత్తాలి వంటి సూచనలను కోర్టులో ఉన్న ప్రతివాదికి ఎప్పటికప్పుడు అందిస్తుంది.

కాగా, ఈ రోబో న్యాయవాది స్మార్ట్‌ఫోన్‌ సహకారంతో పని చేస్తుందని న్యూ సైంటిస్ట్ పేర్కొంది. కోర్టులో వాదనలు విన్న తర్వాత ఏం వాదించాలో అన్నది ఇయర్‌ ఫోన్‌ ద్వారా ప్రతివాదికి సూచిస్తుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాషువా బ్రౌడర్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ 2015లో కాలిఫోర్నియాలో డునాట్‌పే సంస్థను స్థాపించారు. తాము రూపొందించిన డునాట్‌పే యాప్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ అని ఆయన తెలిపారు.

Social Share Spread Message

Latest News