అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో దివంగత నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) 27వ వర్ధంతి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అకుంఠిత దీక్షాదక్షతలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిర్విరామ కృషి, కఠోరమైన క్రమశిక్షణ వంటివి ఎన్టీఆర్కు పర్యాయపదాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం నేపథ్యంలో గత 9 నెలలుగా శతజయంతి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు జయరాం కోమటి పేర్కొన్నారు.
స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట కోగంటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, ప్రసాద్ మంగిన, హరి సన్నిధి, సతీష్ అంబటి, వీరు ఉప్పల, శ్రీని వల్లూరిపల్లి, గోకుల్ రాచరాజు, భాస్కర్ అన్నే, బెజవాడ శ్రీనివాస్, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, సతీష్ బోళ్ల, భరత్ ముప్పిరాళ్ళ, సురేంద్ర కారుమంచి, వాసు బండ్ల, నవీన్ కోడాలి, సుందీప్ ఇంటూరి తదితరులు పాల్గొన్నారు.














