కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వినియోగిస్తున్న కొత్త టెక్నాలజీ కారణంగా ఫోర్జరీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నవారు భారీ సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 530 మంది ప్రవాసులను కువైత్ అధికారులు దేశం నుంచి బహిష్కరించారు. వీరంతా నకిలీ పాస్పోర్ట్స్, తప్పుడు పేర్లతో దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా వాసులు ఉన్నారట. ఇక దేశ బహిర్కరణకు గురైన వారిలో 120 మంది మహిళలు కూడా ఉన్నారు. 2011 ముందు వరకు ఒకసారి దేశం నుంచి బహిష్కరించబడిన వలసదారులు తమ పేర్లు మార్చుకుని తిరిగి కువైత్ వచ్చేవారట. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించే వారిని క్షణాల్లో గుర్తించడం, నేర తీవ్రతను బట్టి దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది కువైత్.














